

భారత క్రికెట్ అభిమానులకు త్వరలోనే కొత్త అనుభవం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బీసీసీఐకి ప్రతిపాదించినట్లు ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ వెల్లడించింది. ఈ అంశంపై ఇరు బోర్డుల మధ్య ఇప్పటికే అనధికారిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా స్పందించలేదు.
ఈ ప్రతిపాదనకు చెన్నైలో జరగనున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) తొలి మ్యాచ్ కారణమైంది. భారత్-ఆస్ట్రేలియా క్రీడా భాగస్వామ్యంలో భాగంగా డిసెంబర్ 12న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్లో విదేశీ ఫ్రాంచైజీ టీ20 లీగ్కు చెందిన తొలి మ్యాచ్గా ఇది చరిత్ర సృష్టించనుంది.
ఈ బీబీఎల్ మ్యాచ్ను ప్రతి ఏడాది నిర్వహించాలని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తే రెండు దేశాల క్రికెట్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సీఏ ఆశిస్తోంది. కొత్త క్రీడా భాగస్వామ్య ఒప్పందంలో కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, టెక్నాలజీ, యువ క్రీడాకారుల మార్పిడి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!