

జపాన్ వేదికగా 20వ ఆసియా క్రీడలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం జరిగిన రెండు గంటల ప్రారంభ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 45 దేశాలకు చెందిన సుమారు 11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. ఈ క్రీడల్లో మొత్తం 469 స్వర్ణ పతకాలు అందించనున్నారు. అక్టోబర్ 4 వరకు జరిగే ఈ గేమ్స్లో బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్ సహా పలు క్రీడల పోటీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 1958, 1994 తర్వాత మూడోసారి జపాన్ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది.
‘హార్మోనిక్ హార్ట్ బీట్’ అనే ఇతివృత్తంతో మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించారు. సుమారు 30 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో హృదయాకారంలో ఏర్పాటు చేసిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐచి ప్రాంత పారిశ్రామిక సాంకేతికతను కళాత్మక ప్రదర్శనలతో మేళవించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. భారీ రోబోటిక్ చేయి జపాన్ జెండాను ఊపుతూ కనిపించడం మరో ప్రత్యేకతగా నిలిచింది. జపాన్ చక్రవర్తి నరుహిటో 20వ ఆసియా క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. సంగీత దర్శకుడు టారో హకసే, స్థానిక మ్యూజిక్ బ్యాండ్ INI తమ ప్రదర్శనలతో వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. మాజీ జపాన్ స్విమ్మర్ కొసుకే కిటజిమా ఆసియా గేమ్స్ టార్చ్ను స్టేడియంలోకి తీసుకొచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!