

బిగ్బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్లోకి అడుగుపెట్టగా, వారిలో 10 మంది సెలబ్రిటీలు, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. ప్రస్తుతం వీరు సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్గా బ్లూ టీమ్, రెడ్ టీమ్లుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. షో ప్రారంభమై కొద్ది రోజులే కావడంతో కంటెస్టెంట్ల బలాబలాలపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రావడం కష్టమే. అయితే హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్ తన మాట తీరు, దూకుడైన ప్రవర్తనతో హౌస్లో ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా రోహిత్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు ఉన్నప్పటికీ, త్రిగుణ్ మంచి వినోదాన్ని అందిస్తున్నాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి వైల్డ్కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ ముందుగానే ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలను కలిపి మొత్తం ఎనిమిది మంది వైల్డ్కార్డ్ ఎంట్రీలుగా హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ‘బిగ్ అగ్ని పరీక్ష 2’లో పాల్గొన్న దీపక్, మితిలేష్, రామకృష్ణ, అపూర్వలో ఇద్దరికి మెయిన్ కంటెస్టెంట్లుగా అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. వీరిలో రామకృష్ణ ఎంట్రీ దాదాపు ఖాయమనే టాక్ ఉండగా, మితిలేష్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అపూర్వకు మాత్రం అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.
సెలబ్రిటీ వైల్డ్కార్డ్ ఎంట్రీల విషయానికి వస్తే, ఈసారి ఎక్కువ మంది మహిళా కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటి సీరత్ కపూర్తో పాటు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ ఫేమ్ సోనియా, ఆషిక, సీరియల్ నటి సౌందర్య రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక పురుష కంటెస్టెంట్లలో జబర్దస్త్ నూకరాజు, రాకింగ్ రాకేష్ను బిగ్బాస్ టీమ్ సంప్రదించినట్లు టాక్ ఉంది. వీరు కూడా షోలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే వీరి ఎంట్రీపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!