

రైతుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వివరించారు. పంచసూత్రాల రూపంలో తీసుకొస్తున్న మార్గదర్శకాలు రైతులకు స్పష్టమైన ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. గత 17 నెలలుగా వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
సోమవారం కృష్ణా జిల్లా ఘంటసాలలో నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 29 వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. పంచసూత్రాల అమలు ద్వారా వ్యవసాయాన్ని మరింత ఆధునికం చేయడమే లక్ష్యమని చెప్పారు.
వచ్చే నెల 3 వ తేదీన ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో వర్క్షాపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్షాపుల్లో నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సాహం, ప్రభుత్వ మద్దతు పథకాలు, రైతుల అవగాహన వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయ, ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం వంటి అన్ని రంగాల రైతులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాలను తయారుచేశామని చెప్పారు. రైతన్నా మీకోసం కార్యక్రమాలను RSK సిబ్బంది ముందుండి నిర్వహించాలని, ప్రతి కేంద్రంలో కార్యాచరణ ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!