

బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా సిద్ధిపేట నుంచి వచ్చి హాజరవుతున్నానని, న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, తాము ఎలాంటి తప్పు చేయలేదని హరీష్ రావు తెలిపారు. సిట్ ముందు ధైర్యంగా వెళ్లి అడిగిన ప్రతి ప్రశ్నకు బాధ్యతాయుతంగా సమాధానం చెబుతామని చెప్పారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైన సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని, సీఎం రేవంత్ రెడ్డి అవినీతి కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటామని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన ఉద్యమకారులమని, ఎన్ని కుట్రలు, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, రెండేళ్లలో ఈ కేసుల్లో ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు, విచారణలు, కమిషన్లు అంటూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రజలకు కావాల్సింది రైతు బంధు, పింఛన్లు, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్మెంట్, తులం బంగారం వంటి హామీల అమలేనని స్పష్టం చేశారు. హామీలు నెరవేర్చకుండా కేసులతో అటెన్షన్ డైవర్ట్ చేస్తే ప్రభుత్వం తప్పించుకోలేదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీయాలన్న ప్రయత్నాలు ఫలించవని, సీఎం కేసులకు పార్టీ భయపడదని హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ రెడ్డికి దిమ్మదిరిగే సమాధానం ఇస్తారని హెచ్చరిస్తూ తన వ్యాఖ్యలను ముగించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!