
దేశంలో మరెక్కడా లేని ప్రత్యేకమైన ఐటీ ఎకోసిస్టమ్ విశాఖపట్నానికి మాత్రమే సొంతమని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం విశాఖలో జరిగిన సమావేశంలో క్యాప్ జెమిని గ్లోబల్ సీఈవో ఐమన్ ఎజాత్, ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురగేశ్లతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో 20 వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC), క్లౌడ్ సర్వీసెస్, బీపీఎం వర్టికల్స్ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయాలని క్యాప్ జెమిని ప్రతినిధులను కోరారు. అలాగే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రాన్ని విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఐటీ, డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని లోకేశ్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలో విశాఖలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. మరో మూడు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజాత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3.4 లక్షల మంది ఉద్యోగులతో తమ సంస్థ పనిచేస్తోందని, అందులో 2 లక్షల మంది భారత్లోనే ఉన్నారని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!