

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రసిద్ధ లడ్డూ తయారీలో నకిలీ నెయ్యి వాడకంపై లంకా దినకర్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఈ ఘటన భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన దినకర్ మాట్లాడుతూ, సీబీఐ విచారణలో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో టీటీడీ ఆధ్యాత్మికతను దెబ్బతీయడానికి పాల్పడిన చర్యలు తీవ్రంగా ఖండించాల్సినవని అన్నారు. తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న టీటీడీని ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా ఆదాయ వనరుగా మార్చారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. బోలే బాబా ఆర్గానిక్ డైరీ అనే సంస్థ 68 లక్షల కేజీల నెయ్యి సప్లై చేసినప్పటికీ, పాలు లేదా వెన్న ఉత్పత్తి చేయలేదన్న నిజం బయటపడిందని దినకర్ పేర్కొన్నారు.
నకిలీ నెయ్యి తయారీలో వాడిన రసాయనాల వివరాలు కూడా సీబీఐకు లభించాయని ఆయన తెలిపారు. “భగవంతుని నైవేద్యంలో కలుషితం జరగడం అంటే భక్తుల మనసులో విశ్వాసాన్ని కదిలించడం” అని అన్నారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!