

గ్రీన్లాండ్ అంశాన్ని నోబెల్ శాంతి బహుమతితో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎనిమిది కంటే ఎక్కువ యుద్ధాలను ఆపినప్పటికీ, తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకూడదని నార్వే నిర్ణయించిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పై శాంతి అంశాల పై ఆలోచించబోనని, పూర్తిగా అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని నార్వే ప్రధాని జోనస్ గార్ స్టోర్ కు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు వెల్లడించారు. అదే సమయంలో గ్రీన్లాండ్ ద్వీపం పై డెన్మార్క్కు ఉన్న యాజమాన్య హక్కులను కూడా ట్రంప్ ప్రశ్నించారు. ఆ ద్వీపం తమదేనని చెప్పేందుకు డెన్మార్క్ వద్ద సరైన రాతపూర్వక ఆధారాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.
వందల సంవత్సరాల క్రితం తమ దేశానికి చెందిన ఒక పడవ గ్రీన్లాండ్కు వెళ్లిందని మాత్రమే డెన్మార్క్ వాదిస్తోందని, అదే లాజిక్ ప్రకారం అమెరికా పడవలు కూడా ఎన్నోసార్లు ఆ ప్రాంతానికి వెళ్లాయని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ను ఆక్రమించేందుకు చైనా, రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, వాటి నుంచి ఆ ద్వీపాన్ని రక్షించే సామర్థ్యం డెన్మార్క్కు లేదని పేర్కొన్నారు.
నాటో కోసం తాను ఎంతో చేశానని, ఇప్పుడు అమెరికా ప్రయోజనాల కోసం నాటో కూడా ఏదో ఒకటి చేయాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచ భద్రత కోసం గ్రీన్లాండ్ పై పూర్తి నియంత్రణ అమెరికాకు ఉండాల్సిందేనంటూ తన సందేశాన్ని ముగించారు.
ఈ వ్యాఖ్యల పై నార్వే ప్రధాని స్పందిస్తూ, నోబెల్ శాంతి బహుమతితో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నోబెల్ విజేతలను పూర్తిగా స్వతంత్ర నోబెల్ కమిటీనే ఎంపిక చేస్తుందని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!