
%20(1).png&w=3840&q=75)
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుత నిరసనకారులపై హింసాత్మక చర్యలు తీసుకుంటే అమెరికా జోక్యం చేసుకుంటుందని, తీవ్ర సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలకు బలం చేకూర్చేలా అమెరికా సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచడం, మధ్యధరా సముద్రం వైపు నౌకాదళాన్ని మోహరించడం జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ బెదిరింపులను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించకున్నా, సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య చిత్రాన్ని (కార్టూన్) పోస్ట్ చేసి, అహంకారంతో ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న వ్యక్తి పతనం తప్పదని సూచించారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ భయపడదని ఆయన తేల్చిచెప్పారు.
పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ ఘలీబాఫ్ సంచలన హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఇరాన్పై సైనిక దాడికి దిగితే, ప్రతిదాడి అమెరికాపై మాత్రమే కాదు, దాని మిత్రదేశమైన ఇజ్రాయెల్పై కూడా ఉంటుందని, అమెరికా సైనిక కేంద్రాలు, నౌకలు, ఇజ్రాయెల్ నగరాలు లక్ష్యాలుగా మారతాయని పేర్కొన్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి భద్రతా సమావేశాలు నిర్వహించి, సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మోహరించారు. ఇరాన్లో ఆందోళనలు మూడో వారంలోకి అడుగుపెట్టగా, మరణాల సంఖ్య 500 కు పైగా చేరినట్లు హక్కుల సంస్థలు తెలిపాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!