

గోదావరి నది పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–నల్లమలసాగర్ విస్తరణ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలను మరింత వేగవంతం చేసింది. ఈ అంశం పై సీనియర్ న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతూ, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతోంది.
ఇటీవల ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తో ముంబైలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, సాంకేతిక వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్కు నీటిని లింక్ చేసేలా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. మొదట ఆమోదం పొందిన ప్రాజెక్టు రూపకల్పనకే పరిమితంగా పనులు జరగాలని, కొత్తగా చేపడుతున్న విస్తరణలు చట్టబద్ధం కావని పిటిషన్లో స్పష్టం చేసింది.
తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా నల్లమలసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ–ఫీజిబిలిటీ నివేదికలను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ అంశం పై కేంద్ర జల సంఘం, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి నీటి యాజమాన్య బోర్డులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.
అలాగే కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీకి ముందుకు వెళ్తోందని, వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొంది. పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!