

జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉందని, అది ఎప్పుడైనా మునిగిందా అని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశ్నించారు. ఏపీలో అమలుచేస్తున్న కుట్రలకు బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో జగన్ పథక రచన చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏం జరుగుతోందో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని వివరించారు. ఆదివారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
వైకాపా ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిల ఆస్తులు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయని, వాటిని చూసి దేశవ్యాప్తంగా ఎంపీలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దోపిడీలు, భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపుల ద్వారానే ఈ ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. అలాగే వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కనీసం అసెంబ్లీకి వచ్చి పులివెందుల ప్రజల సమస్యలైనా జగన్ మాట్లాడాలని సూచించారు.
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని అప్పలనాయుడు అన్నారు. ప్రధాని మోదీ సహకారంతో చంద్రబాబు అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న సమయంలో వైకాపా నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి అంటే జగన్కు ఇష్టమని సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారు అని ఆయన విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నదీ తీర ప్రాంతాల్లో ఉన్న మహానగరాల గురించి ఓ వీడియో రూపొందించి బెంగళూరు ప్యాలెస్లో ఉండే జగన్రెడ్డికి పంపుతానని తెలిపారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!