

తెలంగాణ లో ఎమ్మెల్యే ల పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో పురోగతిపై రెండు వారాల తర్వాత విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెక్రటరీల మార్పు కారణంగా ప్రక్రియ ఆలస్యమైందని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు నివేదించారు. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి, పలు కంప్లైంట్లపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు లేదా ఆరు వారాల గడువు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.
కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితర పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ శేషాద్రి నాయుడు - స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని వాదించారు. ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సీజేఐ బెంచ్ గతంలోనే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అయినప్పటికీ గడువులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్పై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన కేసు, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన తన కుమార్తె కోసం ప్రచారం చేసిన అంశాలకు సంబంధించిన రెండు పిటిషన్లు ఇంకా స్పీకర్ కార్యాలయంలో పెండింగ్లోనే ఉన్నాయని ఆరోపించారు. ఇరువైపు వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం - నాలుగు లేదా ఆరు వారాల గడువును నిరాకరించి, కేవలం రెండు వారాల వాయిదానే మంజూరు చేసింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!