

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెన్షన్ వ్యయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం గత 18 నెలల్లో కేవలం పెన్షన్ల కోసమే 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని గోపీనాథపట్నంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం, ఉంగుటూరులో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను పరిశీలించి ప్రజా వేదికలో మాట్లాడారు.
చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలు చేస్తున్న సూపర్ సిక్స్ కార్యక్రమం ప్రజాదరణ పొందిందని, ఇది సూపర్ హిట్గా నిలిచిందని తెలిపారు. 18 నెలల్లో 50 వేల కోట్లు పెన్షన్లకే వెచ్చించటం వంటి భారీ ఖర్చు, ఏపీ కంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రాల్లో కూడా కనిపించదని అన్నారు.
రాబోయే ఐదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల పెన్షన్లు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 13 మందికి పెన్షన్ అందుతోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం క్రమంగా నెరవేర్చుతున్నదని, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ మాట తప్పబోమని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (1)
Good initiative!