

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విద్యుత్ రంగం మూల స్తంభమని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. గత వైకాపా ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.30 వేల కోట్ల భారం మోపిందని ఆరోపించారు.
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడిదారులను గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి దూరం చేసిందని మంత్రి పేర్కొన్నారు. అప్పుల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థను తమ ప్రభుత్వం గాడిలో పెడుతోందని చెప్పారు. దేశంలో తొలిసారిగా 13 పైసల ట్రూడౌన్ సాధించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆక్వా రైతులకు యూనిట్కు రూ.1.5 కే విద్యుత్ అందిస్తున్నామని, యూనిట్ కొనుగోలు ధరను రూ.6.35 కు తగ్గించి రూ.340 కోట్లు ఆదా చేశామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీతో పీఎం సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!