

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ను బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్గ్రామ్లో నడి రోడ్డుపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన చంద్రనాథ్ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇక కోల్కతాలోని న్యూ మార్కెట్లో మాంసం దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనకు బీజేపీ కార్యకర్తలే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించగా, తృణమూల్ కార్యకర్తలే పార్టీ జెండాలతో ఈ దాడులకు పాల్పడ్డారని బీజేపీ ప్రతివాదించింది. కోల్కతా పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ నంద్ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న 80 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు మే 9న కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుండగా, నరేంద్ర మోదీ, అమిత్ షా సహా ఎన్డీయే నేతలు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీ ఎన్నికలను బీజేపీ దోచుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!