

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభివృద్ధి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టడంతో పాటు కేంద్రం నుంచి మరిన్ని నిధులు ఎలా రాబట్టాలనే అంశంపై ఎంపీలు ఆలోచించాలని సూచించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై ఆయన దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్ర–రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం మరియు నల్లమల సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని సీఎం సూచించారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును ఈ సెషన్లోనే ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్రంలోని సంబంధిత మంత్రులు, అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన నిధులు, ఆర్ అండ్ ఆర్ పూర్తి అంశాలను గట్టిగా ప్రస్తావించాలని, జలవనరుల ప్రాజెక్టుల విషయంలో వివాదాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికలు రూపొందించామని, రైల్వే శాఖలో అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం తెలిపారు. ఫ్లైఓవర్లు, రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి అవకాశాలను గుర్తించి కేంద్ర నిధులు తెచ్చుకోవాలని సూచించారు. రాష్ట్ర అంశాలతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలని, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు ఎంపీలకు సూచించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!