

కేరళలో ప్రజలు రాజకీయ మార్పును ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రంలో మార్పు వైపు ప్రజల అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలక్కడ్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చాలా సంవత్సరాలుగా ఈ రెండు కూటములు పరస్పరం అధికారాన్ని మారుస్తూ వచ్చాయని, కానీ రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ కూటములు విఫలమయ్యాయని పేర్కొన్నారు.
కేరళ రాజకీయాలు స్వార్థ ప్రయోజనాల చుట్టూ తిరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఈ పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా కనిపిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందని తెలిపారు. అప్పులు భారీగా పెరిగి రూ.5 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతి ద్వారా దుర్వినియోగమైన నిధులను తిరిగి తీసుకుని, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం ఏప్రిల్ 9 న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!