.jpg&w=3840&q=75)

ప్రధాని నరేంద్రమోదీ తన రాజకీయ జీవితంలో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి పదవీకాలాన్ని కలుపుకుని మొత్తం 8,931 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా ప్రభుత్వ అధిపతిగా కొనసాగుతూ దేశంలో అత్యధిక కాలం సేవలందించిన నేతగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజుల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాజాగా ఆ రికార్డును మోదీ అధిగమించారు.
2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014 వరకు ఆ పదవిలో కొనసాగి, అనంతరం దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి నిరవధికంగా ప్రధానిగా కొనసాగుతున్నారు. గుజరాత్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా కూడా మోదీ ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే ముఖ్యమంత్రిగా విస్తృత అనుభవం కలిగిన ప్రధాని కూడా ఆయనే. స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న తొలి కాంగ్రెసేతర నాయకుడిగా మోదీ నిలిచారు. కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేసి, మూడోసారి కూడా అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా రికార్డు సృష్టించారు.
2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని విజయపథంలో నడిపిస్తూ మూడు వరుస విజయాలు సాధించారు. దీంతో మూడు సార్లు కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేశారు. గతేడాది జూలైలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, వరుసగా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు.
అదనంగా, 2002, 2007, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మరియు 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో విజయాలు సాధించి, వరుసగా ఆరు ఎన్నికల్లో ఒకే పార్టీ తరఫున గెలిచిన ఏకైక నాయకుడిగా మోదీ నిలిచారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!