

సమ్మక్క – సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని మేడారం ఆధునీకరణ పనులను రూ.200 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టామని, ఇప్పటివరకు దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార – పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడిన ఆయన, కనీసం 200 సంవత్సరాల పాటు నిలిచేలా రాతి కట్టడాలతో ఈ పనులు చేపట్టినట్టు వివరించారు. మేడారం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇందుకోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించినట్టు తెలిపారు. భక్తుల సౌకర్యాల కోసం మరింతగా 63 ఎకరాల భూసేకరణకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
ఈ నెల 29 నుంచి 31 వరకు జరగనున్న మేడారం జాతర కుంభమేళాను తలపించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన మేడారం జాతర ఏర్పాట్లు, ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా తాను, ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖలతో కలిసి తరచూ పర్యటనలు చేసి సూచనలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 18 న మేడారం ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ, శాసనమండలి సభ్యులు, మంత్రులు మరియు స్పీకర్లను ఆహ్వానించనున్నట్టు మంత్రి వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!