

తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపడుతున్నారని కాంగ్రెస్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు మరో మూడు వారాల సమయం కావాలని సింఘ్వీ అభ్యర్థించగా, సుప్రీంకోర్టు స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇది స్పీకర్కు చివరి అవకాశమని పేర్కొన్న సుప్రీంకోర్టు, గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే మూడుసార్లు గడువు ఇచ్చామని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆరు నెలల్లోనే కాంగ్రెస్ తరఫున మళ్లీ పోటీ చేశారని, ఓడిపోయిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ అంటున్నారని మోహిత్ రావు వాదించారు. మరో ఎమ్మెల్యే కుమార్తె కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిందని, ఆ సమయంలో ఆయన ఆమెతోనే ఉన్నారని కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎనిమిది ఫిరాయింపు పిటిషన్లపై తీర్పులు వెలువడ్డాయని అభిషేక్ సింఘ్వీ తెలిపారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!