

వరంగల్ ఏనుమాముల మార్కెట్యార్డ్లో పత్తి కొనుగోళ్ల పరిస్థితిని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆయన, పత్తికి సరైన మద్దతు ధర ఇవ్వకపోతే రైతుల ఆవేదన మరింత పెరుగుతుంది అని తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పత్తి రైతుకు న్యాయం చేయకపోతే, రైతులు పండించిన తెల్ల బంగారాన్ని జూబ్లీహిల్స్లోని సీఎం నివాసం ముందు పోసి, అక్కడే ఆందోళన చేపడతాం అని హెచ్చరించారు.
మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయిన కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం- కేంద్రం వైఖరి రైతులను కృంగదీస్తోందని ఆయన చెప్పారు. సీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు అనుకూలంగా లేవని ఆయన విమర్శించారు. రైతులు అమ్మడానికి మార్గం లేకపోవడంతో దళారుల వద్దకు వెళ్లాల్సి వస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలూ రైతుల సమస్యల్ని పక్కన పెట్టి వేరే విషయాల్లో మునిగి ఉన్నాయని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు ఢిల్లీకి వెళ్లారు, కానీ రైతుల సమస్యల్ని మాత్రం కేంద్రానికి చెప్పడం లేదు. జూబ్లీహిల్స్లో డబ్బులు భారీగా ఖర్చు చేస్తారు కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. కపాస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు, విదేశాల నుంచి పత్తి దిగుమతులకు ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నా, రైతులకు మాత్రం సహాయం చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు 406 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారిని ఆదుకోవాల్సిన సమయంలో ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
అంతకుముందు ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మధుసూదనాచారి, చల్లా ధర్మారెడ్డి, మాలోత్ కవిత కూడా మార్కెట్యార్డును పరిశీలించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!