

సిరిసిల్ల నియోజకవర్గంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే కొనుగోలు ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సిరిసిల్ల జిల్లాలో నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదని అన్నారు. రైస్ మిల్లులు కేటాయించకపోతే కొనుగోలు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ధాన్యం కొనకుండా వదిలేసి, దళారులకు అవకాశం కల్పిస్తున్నారని విమర్శించారు.
రైతుబంధు పేరుతో చెప్పినా రైతులకు ఆ సాయం కూడా అందడం లేదని కేటీఆర్ అన్నారు. స్థానిక అధికారులను అడిగితే ఇప్పటివరకు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం కూడా కొనలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి పాడైపోకుండా రైతులే టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసి కప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఎక్కడా చూడలేదని విమర్శించారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని, లేదంటే తాము రోడ్డెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరో రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!