
.jpg&w=3840&q=75)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయ దిశగా దూసుకెళ్తుండడంతో గాంధీ భవన్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఫలితాల ధోరణి వెలువడిన క్షణం నుంచి కార్యకర్తలు గాంధీ భవన్కు చేరుకుని జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. “సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్”, “టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్”, “రాహుల్ గాంధీ జిందాబాద్”, “మల్లిఖార్జున ఖర్గే జిందాబాద్” అంటూ నినాదాలతో గాంధీ భవన్ మారుమోగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంపై పార్టీ శ్రేణులు ప్రశంసలు కురిపించాయి. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు కృషి ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. జాతీయ నాయకత్వం అందించిన మార్గదర్శకత్వం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని నేతలు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధి పట్ల ప్రజలు విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని వారు తెలిపారు. మున్సిపల్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయాలు భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేస్తాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని, అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు. గాంధీ భవన్లో కొనసాగుతున్న ఈ సంబరాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!