

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, విజయమే లక్ష్యంగా వ్యూహాత్మక సమావేశాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ కీలక సమావేశానికి టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనున్నారు. సమావేశంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సంఖ్యలో సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నప్పటికీ, ప్రత్యర్థి బీఆర్ఎస్ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో అధికార పార్టీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాన్ని ప్రత్యర్థులకు ఇవ్వకుండా అన్ని మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి వార్డు, డివిజన్ నుంచి ఆరుగురు చొప్పున అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసి, వారిలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి సర్వే నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చిన అంశం పై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. మరోవైపు కృష్ణా, గోదావరి జలాల పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన అంశాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే దిశగా కూడా కార్యాచరణ ఉండనుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అదనంగా డీసీసీల కూర్పు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 15 న మండలాధ్యక్షుల నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!