

ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించారు. హైదరాబాదులోని భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ సమ్మిట్కు రావాలని సీఎం ప్రత్యేకంగా కోరారు.
పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రాన్ని సీఎం ప్రధానికి అందజేశారు.
దేశ అభివృద్ధికి కేంద్రం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ కూడా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని సీఎం వివరించారు. ఈ క్రమంలో అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలతో పాటు భవిష్యత్తు ప్రణాళికల పై సమగ్ర విశ్లేషణ జరిగేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశామని తెలిపారు.
నీతి ఆయోగ్ సూచనలు, నిపుణుల చర్చల ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ను గ్లోబల్ సమ్మిట్లో ప్రజలకు పరిచయం చేయనున్నట్లు సీఎం తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం మరింత సహకారం అందించాలని సీఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు, అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కేంద్ర అనుమతి అవసరమని, 162.5 కిలోమీటర్లు విస్తరించే ఈ ప్రాజెక్టును రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా అమలు చేయాలని చెప్పారు. దాదాపు రూ.43,848 కోట్ల ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వాలని అభ్యర్థించారు.
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదం, ఫైనాన్షియల్ అనుమతులు ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి కూడా క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం కోరారు. రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును కూడా తొందరగా ప్రారంభించాలని సూచించారు.
అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం, అలాగే హైదరాబాద్–బెంగళూరు హై స్పీడ్ కారిడార్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధానికి వినతిపత్రం అందించారు.
అలాగే మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకూ టైగర్ రిజర్వ్ ప్రాంతం మీదుగా ఫోర్ లేన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని కోరారు, తద్వారా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయ రవాణా సౌకర్యం అందుతుందని సీఎం వివరించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!