

అమరావతిని హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని నిర్మాణ ప్రణాళిక పై సచివాలయం ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాలు లో రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అమరావతి పరిధిలో ప్రస్తుతం ఉన్న 29 గ్రామాల భూభాగం పూర్తి స్థాయి రాజధానిని నిర్మించడానికి సరిపోదని చెప్పారు. ఈ పరిధితో అభివృద్ధి చేయాలంటే అది ఒక మున్సిపాలిటీ స్థాయిని మించినంతగా వృద్ధి చెందదని ఆయన స్పష్టం చేశారు. అందుకే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరింత భూసేకరణ తప్పనిసరి అవుతుందని రైతులకు వివరించారు.
రాజధాని అభివృద్ధి కార్యక్రమాలకు రైతుల సంపూర్ణ సహకారం అవసరమని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రజలందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
కేపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును మరో రెండేళ్ల పాటు పొడిగించాలనే అంశాన్ని రైతులు కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన సమయంలో ఈ విషయంలో తమ విజ్ఞప్తిని వ్యక్తం చేయాలని రైతులను కోరారు.
రాజధాని రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ చర్యలు వేగవంతం చేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!