

పూర్వోదయ, సాస్కీ వంటి కేంద్ర పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపును లక్ష్యంగా చేసుకున్న పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు ఇవ్వాలని సీఎం కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వివరాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకు కేంద్రం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని వివరించారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మూడు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రూపంలో అందించినట్లు సీఎం తెలిపారు. ప్రాజెక్టు అమలుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు, అలాగే ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను (PPR) కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్లు వెల్లడించారు. దీనికి ఆమోదం లభించిన వెంటనే డీపీఆర్ సమర్పిస్తామని చెప్పారు.
ఆమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం అందించిన రుణ సహకారం తరహాలోనే, ఈ ప్రాజెక్టుకూ ఆర్థిక సహాయం అందించాలని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు వంటి కరవు పీడిత జిల్లాలకు సాగునీరు,త్రాగునీరు అందుతుందని తెలిపారు.
2026–27 కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!