

మొంథా తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలోని రాయలచెరువుకు గండి పడి పరిసర గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ట్యాంకు గోడ విరిగిపోవడంతో నీరు గ్రామాల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అనేక పశువులు చనిపోగా, రైతులు మరియు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, పంటలు మరియు పశు సంపదకు భారీ నష్టం సంభవించింది. పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే తుఫాను బాధితులకు సహాయం అందిస్తోంది. బాధిత కుటుంబాలకు ఇంటికి వెళ్లే ముందు రూ.3,000 నగదు, బియ్యం మరియు నిత్యావసరాలు అందజేయడం ప్రారంభించింది.
ఇక రాయలచెరువు గండి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. నష్టపోయిన కుటుంబాలకు మరియు పశు యజమానులకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక సీఎస్ జి. జయలక్ష్మి జీవో ఆర్టీ నంబర్ 125 ను విడుదల చేశారు. ఈ నెల 6 న కేవీబీ పురం మండలం వల్లూరు గ్రామ సమీపంలో గండి పడటంతో, కాల్తూరు హరిజనవాడ, ఎస్ఎల్ పురం, పాతపాలెం గ్రామాలు నీటమునిగాయి. ఈ దుర్ఘటనలో 1100 పశువులు చనిపోయాయి. దీంతో 960 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం, అలాగే పశు నష్టానికి రూ.2 కోట్లు 95 లక్షల పరిహారం విడుదల చేయడానికి జిల్లా కలెక్టర్కు అనుమతి ఇవ్వబడింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాధిత గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎదుర్కొన్న కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందని వారు అభిప్రాయపడ్డారు.











కామెంట్స్ (2)
ప్రభుత్వం బాధితులకు అండగా నిలవడం ప్రశంసనీయం
ప్రభుత్వ నిర్ణయానికి అభినందనలు