

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన నారావారిపల్లెకు రానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా పూర్తి చేయాలని సూచించారు.
ముందస్తు భద్రత చర్యలలో భాగంగా నారావారిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, డీపీఓ సుశీల దేవి, అడిషనల్ ఎస్పీలు తదితర అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన, భద్రత, కార్యక్రమాల నిర్వహణపై విస్తృతంగా చర్చించారు.
షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.20 గంటలకు రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ముఖ్యమంత్రి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గాన నారావారిపల్లెకు వెళ్లనున్నారు. గ్రామంలో బస చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి నివాసం వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!