

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికత, పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఎదుగుతోందని తెలిపారు.
ఇళ్ల పై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారులు ఇప్పుడు ప్రోజ్యూమర్లుగా మారుతున్నారని చెప్పారు. సన్రైజ్ ఏపీలో వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న తీరరేఖ వెంబడి భవిష్యత్తులో 20 పోర్టులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
సౌర, పవన, జల విద్యుత్, పంప్డ్ స్టోరేజీ వంటి విద్యుత్ ఉత్పత్తికి, అలాగే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తయారీకి ఏపీ అనువైన రాష్ట్రమని సీఎం తెలిపారు. AM Green సంస్థ నిర్మిస్తున్న ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఇథనాల్, గ్రీన్ మాలిక్యూల్స్ వంటి ఉత్పత్తులు వెలువడతాయని పేర్కొన్నారు.
గ్రీన్ ఎనర్జీ పై ప్రపంచవ్యాప్తంగా చర్చ వస్తే కాకినాడ పేరు వినిపించే స్థాయికి రాష్ట్రం చేరిందని చంద్రబాబు చెప్పారు. కాకినాడలోనే 2 గిగావాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రోలైజర్స్ తయారీకి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
ఏపీ క్లీన్ అండ్ గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ–2024 దేశంలోనే అత్యుత్తమ విధానమని పేర్కొంటూ, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలతో పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పారిశ్రామికవేత్తలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అనుమతులు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
గ్రీన్ అమోనియా ప్రకృతి సేద్యానికి ఎంతో ఉపయోగపడుతుందని, అధికంగా ఎరువులు వాడటం వల్ల ఏపీలో నీటిలో నైట్రోజన్, సెలినిటీ స్థాయిలు పెరిగాయని సీఎం గుర్తు చేశారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే అవకాశాలు ఉంటాయని చెప్పారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అభివృద్ధి, సంపద సృష్టి జరిగి సంక్షేమానికి బాట వేయాలన్నదే తమ ఆలోచనగా చంద్రబాబు వివరించారు. 18 నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి సంక్షేమంలో రికార్డు సాధించామని తెలిపారు.
ఏపీపై నమ్మకం ఉంచి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే రావడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు భారాన్ని రూ.1.19 వరకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే యూనిట్కు 29 పైసల మేర వినియోగదారులపై భారం తగ్గించామని వెల్లడించారు.
విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ గిగా సెంటర్ ఏర్పాటు చేసేందుకు Google ముందుకు వచ్చిందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటం వ్యాలీ ప్రకటించి ఆధునిక భవిష్యత్తుకు నాంది పలికామని, వచ్చే ఆరు నెలల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.
స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో కూడా రాష్ట్రం పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తుందని, సంపద సృష్టికి ఏపీని మించిన గమ్యస్థానం మరొకటి లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!