

వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా చేయడం వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసేందుకు పన్నిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మాజీ సీఎం
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది డబ్బు కోసం చేసిన తప్పు కాదని, తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అప్పటి ఈవో ద్వారా అమలు చేసిన పన్నాగమని తీవ్రంగా మండిపడ్డారు. అప్పటి తితిదే ఛైర్మన్, బోర్డు సభ్యులకూ ఈ వ్యవహారం తెలిసే జరిగిందని, టెండర్ నిబంధనలను అడ్డగోలుగా మార్చి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు అప్పటి ఛైర్మన్ పీఏకు రూ.4.68 కోట్ల కమీషన్ ఇచ్చినట్లు సిట్ తేల్చిందని చంద్రబాబు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు, సిట్ ఛార్జిషీట్ను ప్రజల ముందుంచుతామని చెప్పారు. దేవుడి పవిత్రతను దెబ్బతీయడం మహాపాపమని పేర్కొంటూ, తిరుమలలో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా ఏకసభ్య కమిటీని నియమించి లోపాలపై చర్యలు చేపడతామని, దోషులు తప్పించుకోకుండా అన్ని చట్టపరమైన మార్గాలు అనుసరిస్తామని సీఎం స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!