

రాష్ట్ర పరిపాలనలో పనితీరు, ప్రజా సేవల నాణ్యత, శాఖల పురోగతి వంటి అనేక అంశాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సచివాలయంలో విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్న ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. ‘మినీ కలెక్టర్ల సదస్సు’ తరహాలో జరిగిన ఈ సమీక్షలో ప్రతి శాఖ పై సీఎం స్వయంగా అభిప్రాయాలు వ్యక్తం చేసి, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను గుర్తు చేస్తూ, గత 18 నెలల్లో ప్రతి శాఖ పనితీరును ప్రతిబింబించే ‘ప్రోగ్రెస్ కార్డులను’ అధికారుల ముందుంచారు. ప్రజల్లో ప్రస్తుతం ఉన్న 69.98 శాతం సంతృప్తి రేటు వచ్చే మూడు నెలల్లో 80 శాతానికి పెరగాలని సూచించారు.
ఇక పరిపాలనలో మాన్యువల్ వ్యవస్థకు పూర్తిగా తెరదించేందుకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 15 నుంచి అన్ని శాఖల పనితీరు పూర్తిగా ఆన్లైన్లోనే సాగాలని స్పష్టం చేశారు. అదే తేదీ నుంచి ‘వాట్సాప్ గవర్నెన్స్’ పరిధిలో 1,200 సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. ప్రజలు ఈ డిజిటల్ సేవలను ఎక్కువగా వినియోగించేలా విభాగాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైళ్లను పెండింగ్ పెట్టే అలవాటుకు ఇక అవకాశం లేదని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు సహా ఎవరి దగ్గరైనా ఫైళ్లు 15 రోజులకు మించి నిలిచిపోకూడదని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిన నిధులు ఖర్చు కాక మిగలకుండా రాష్ట్ర వాటాను సమయానికి విడుదల చేయాలని సూచించారు. నిధులు ఉపయోగించకుండా పెండింగ్లో ఉంచితే సంబంధిత శాఖాధిపతులు, మంత్రులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ హామీని గుర్తుచేసిన సీఎం, ఇందుకోసం ఆదాయ వనరులను పెంచేందుకు ఆర్థిక శాఖ చురుకుగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వం తీసుకున్న అధిక వడ్డీ రుణాల్లో కొన్నింటిని రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంటే, మార్చి నాటికి సుమారు వెయ్యి కోట్లు ఆదా చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సులో శాఖల లక్ష్యాలు, భవిష్యత్ కార్యచర్యాల పై మరింత వివరమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
_1771477764226.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!