

దాదాపు నాలుగేళ్లుగా విడుదలకు నోచుకోని బాలీవుడ్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2, 2026న జీ5లో నేరుగా ప్రీమియర్ కానుంది. నవ్జోత్ గులాటీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దినేశ్ విజన్కు చెందిన మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
2022లోనే ఈ సినిమా నిర్మాణం పూర్తయినప్పటికీ, చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా మేకర్స్ ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇందులో మృణాల్ ఠాకూర్ ‘పూజా’ పాత్రలో నటించగా, ఆమె ప్రియుడు అనికేత్ మరణం తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. హుమా ఖురేషీ ‘సనా’గా, పూజాకు సన్నిహితురాలైన న్యాయవాది పాత్రలో కనిపించనుంది. ఈ కేసుకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితుల్లో సనా కూడా భాగమవుతుంది.
అనుమానం, వ్యామోహం, ఆరోపణలు, పక్షపాత భావనల వల్ల ఎదురయ్యే పరిణామాలు వంటి అంశాల చుట్టూ ఈ థ్రిల్లర్ కథ సాగుతుంది. విక్రమ్ సింగ్ చౌహాన్, సీనియర్ నటుడు విజయ్ రాజ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. నిర్మాణం పూర్తయినప్పటి నుంచి విడుదల వరకు సుదీర్ఘ ప్రయాణం సాగించిన ‘పూజా మేరీ జాన్’ ఇప్పుడు అక్టోబర్ 2న జీ5లో ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!