

ఐఐటీ కాన్పూర్లో 2000 సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ పై ఉన్న గాఢమైన అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో స్థిరపడిన విద్యార్థులు కూడా కలిసి, తాము చదువుకున్న సంస్థ అభివృద్ధికి తమ వంతు సహాయం చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో వారు సమిష్టిగా విరాళాలు సేకరించగా, మొత్తం విరాళం సుమారు రూ.100 కోట్లకు చేరుకుంది. ఐఐటీ కాన్పూర్ ప్రాంగణంలో నిర్వహించిన రజతోత్సవ ఆత్మీయ సమ్మేళనంలో ఈ విరాళం గురించి అధికారికంగా ప్రకటించారు. తమ జీవితాలకు దిశానిర్దేశం చేసిన విద్యాసంస్థకు, గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పూర్వ విద్యార్థులు భావోద్వేగంగా వెల్లడించారు.
దేశంలో ఒకే బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఇంత భారీ మొత్తాన్ని తమ విద్యాలయానికి విరాళంగా సమకూర్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ, ఈ విరాళాన్ని ‘మిలేనియం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ’ స్థాపనకు వినియోగించాలని పూర్వ విద్యార్థులు కోరినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో పని చేస్తున్న తమ విద్యార్థుల పై గర్వంగా ఉందని ఆయన అన్నారు.
పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, “ఈ విరాళం ద్వారా ఒక విద్యార్థి తన విద్యాలయాన్ని ఎప్పటికీ మరచిపోకూడదన్న సందేశం ఇవ్వాలనుకున్నాం. ఐఐటీ కాన్పూర్తో మా అనుబంధం చిరస్థాయిగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
1959 లో స్థాపితమైన ఐఐటీ కాన్పూర్కు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తింపు ఇచ్చింది. ఈ సంస్థలో సీటు లభించడమే ఒక వరంగా భావించే స్థాయిలో, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.














.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!