

ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండ తమ హల్దీ వేడుకకు సంబంధించిన అందమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు. రష్మిక హల్దీ వేడుకలో తీసిన రంగురంగుల ఫొటోలను షేర్ చేస్తూ, ఆ వేడుక హోలీ పండుగను తలపించిందని తెలిపారు. ఆ రోజున తన జుట్టుపై పడిన రంగు ఇప్పటికీ పూర్తిగా పోలేదని కూడా సరదాగా పేర్కొన్నారు. ఆ రోజు నిర్వహించిన ఆటలన్నింటిలో తానే గెలిచానని, తన టీమ్ సహకారంతో అది సాధ్యమైందని, విజ్జూ (విజయ్) కూడా తన టీమ్లోనే ఉన్నాడని రష్మిక చెప్పారు. పెళ్లి వేడుకలకు ఆతిథ్యం ఇచ్చిన ప్రముఖ హోటల్కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విజయ్ దేవరకొండ కూడా తమ హల్దీ వేడుక జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక భావోద్వేగ పోస్టు చేశారు. తాను స్వదేశంలోనే పెళ్లి చేసుకోవాలని, అది అవుట్డోర్లో జరగాలని ఎప్పటి నుంచో అనుకున్నానని చెప్పారు. అందుకు ఉదయ్పూర్ కంటే మంచి ప్రదేశం లేదని భావించామని తెలిపారు. అక్కడ నిర్వహించిన హల్దీ వేడుకను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం జరిగింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట ప్రస్తుతం ‘రణబలి’ అనే చిత్రంలో మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!