

కాలేజీలో చదువుతున్న సమయంలో కారు కొనాలనే కోరికే తనను తొలిసారి సినిమా సెట్స్ వరకు తీసుకెళ్లిందని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న రకుల్ తన సినీ ప్రయాణం ఎలా మొదలైందో వివరించింది. తన ఫొటోలు చూసిన కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు తన తండ్రిని కలిసి సినిమాలో నటించే అవకాశం ఇచ్చారని తెలిపింది. అప్పటికి సినిమాలపై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పింది. అయితే ఆ చిత్రానికి రూ.5 లక్షల పారితోషికం ఇస్తామని చెప్పడంతో, ఆ డబ్బుతో కారు కొనుక్కొని తన స్నేహితుల్లో సొంత కారు ఉన్న తొలి అమ్మాయిగా నిలవాలనే కోరికతో సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. దాదాపు 40 రోజుల షూటింగ్లో పాల్గొన్న తర్వాత కెమెరా ముందు ఉండటం తనకు ఎంతో ఇష్టమని అర్థమైందని రకుల్ చెప్పింది.
అయితే వెంటనే సినిమాల్లో కొనసాగకుండా ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆ తర్వాత నటనను కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు రకుల్ తెలిపింది. 2009లో కన్నడ చిత్రం ‘గిల్లీ’తో వెండితెరకు పరిచయమైన ఆమె.. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఎవరి ప్రమేయం లేకుండానే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, తనకు తానుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. కెరీర్ ప్రారంభంలో చదువు కారణంగా కొన్ని పెద్ద సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని కూడా వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హిందీ చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రలో కనిపించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!