

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పవన్ కల్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించింది.
దర్శకుడు హరీశ్ శంకర్ పర్యవేక్షణలో నిర్మాణానంతర పనులు శరవేగంగా సాగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. అభిమానుల కోసం త్వరలోనే ఒక ప్రత్యేక అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొంది. మొదట ఈ సినిమాను మార్చి 26 న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, వారం రోజుల ముందుగానే అంటే మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇటీవల వెల్లడించారు.
ఈ చిత్రానికి ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పనిచేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పాటలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, నేపథ్య సంగీత బాధ్యతలను తమన్ చేపట్టారు. దేవిశ్రీ ప్రసాద్ ఇతర పనులతో బిజీగా ఉండటం వల్ల పరస్పర అంగీకారంతో తమన్ను నేపథ్య సంగీతం కోసం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, తమన్ నేపథ్య సంగీతంతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!