

హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్పై ఉదయ్ శర్మ కథ, దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా రూపొందిన కుటుంబ చిత్రమే సఃకుటుంబానాం. ఈ సినిమా జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటించగా, నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందించగా, మధు దాసరి సినిమాటోగ్రఫీ, శశాంక్ మలి ఎడిటింగ్ చేశారు. ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ అయిన రామ్ కిరణ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు.
చిత్ర విడుదల సమీపిస్తున్న సందర్భంగా రామ్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, బెంగళూరులో పెరిగిన రోజుల్లో ఆ ఆసక్తి మరింత పెరిగిందని తెలిపారు. దేశంలోని అనేక చిత్ర పరిశ్రమల్లో కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఆయన, హీరో కావాలన్న కోరికతో నటన వైపు అడుగులు వేశారని చెప్పారు. సఃకుటుంబానాం కథ, ఇందులో తన పాత్ర సాధారణ హీరోల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా, సైకాలజీ టచ్తో ఉండటమే తనను ఆకట్టుకుందని అన్నారు. మేఘ ఆకాష్ ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి గర్వం లేకుండా తనకు సపోర్ట్ చేశారని, ఆమె నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు.
సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు గొప్ప అదృష్టమని, వారు తనకు గురువుల్లా మారారని రామ్ కిరణ్ అన్నారు. దర్శకుడు ఉదయ్ శర్మ కథ విషయంలో చాలా కచ్చితంగా, శ్రద్ధగా పనిచేశారని ప్రశంసించారు. తొలి సినిమా కావడంతో తానే కొరియోగ్రఫీ చేయకుండా ఇతర కొరియోగ్రాఫర్ల సహాయం తీసుకున్నానని చెప్పారు. మణిశర్మ సంగీతం సినిమాకు పెద్ద బలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొంతమంది కుటుంబాలకు ప్రివ్యూ షోలు వేశామని, వారి స్పందన విని తన కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపారు. కుటుంబంతో కలిసి పిల్లలతో చూడదగిన సినిమా అని వారు చెప్పడం తనకు పూర్తి నమ్మకం ఇచ్చిందని అన్నారు. జనవరి 1 న విడుదలయ్యే ఈ సినిమా కుటుంబ విలువలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!