

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి తీవ్రమైన భావోద్వేగాలు, హింసతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం ప్రభాస్తో ‘స్పిరిట్’ తెరకెక్కిస్తున్న ఆయన ‘రోమాంచకం’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమంత్ ప్రభాస్, అనంతిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ తాను ‘యానిమల్’ సినిమా చేస్తున్న సమయంలో ‘రోమాంచకం’ కథ విన్నానని తెలిపారు. కథ విని చాలా నవ్వుకున్నానని, అందులో నిజాయితీ తనను ఆకట్టుకుందని చెప్పారు. తాను ఇలాంటి కథను రాయలేనని భావించి ఈ సినిమాను నిర్మించానని వెల్లడించారు. తన గత సినిమాలకు ‘A’ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ, తొలిసారి తాను నిర్మించిన సినిమాకు క్లీన్ ‘U/A’ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు. అయితే ‘స్పిరిట్’కు మాత్రం కచ్చితంగా ‘A’ సర్టిఫికెట్ వస్తుందని స్పష్టం చేశారు.
ట్రైలర్ను బట్టి ‘రోమాంచకం’ ఒక జెన్-జీ ప్రేమకథగా కనిపిస్తోంది. హీరో ఓ స్టార్టప్ కంపెనీని నడుపుతుండగా, ఆ ప్రయాణంలో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిన తర్వాత అలకలు, విభేదాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ఈ ప్రేమకథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుందనేదే సినిమా కథ. ప్రస్తుత యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, వారికి నచ్చేలా ఈ ప్రేమకథను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రానికి వేణు దర్శకత్వం వహించారు.














కామెంట్స్ (1)
Super andi Sandeep Reddy vanga garu 🙌