

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన బన్నీ వాసు మరియు వంశీ నందిపాటి మరోసారి ప్రేక్షకుల ముందుకు “హే బలవంత్” అనే పూర్తి వినోదాత్మక చిత్రంతో వస్తున్నారు. గోపీ అచ్చర దర్శకత్వంలో, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సుహాస్, శివానీ నాగారం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ నెల (ఫిబ్రవరి) 20 న విడుదల కానుంది.
మీడియాతో మాట్లాడిన శివానీ నాగారం ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది సుహాస్తో ఆమె రెండో సినిమా, తన కెరీర్లో మూడో చిత్రం అని చెప్పారు. గతంలో చేసిన పాత్రతో పోలిస్తే, ఈ సినిమాలో తన పాత్ర చాలా సరదాగా, అమాయకత్వం మరియు కామెడీ కలిసిన విధంగా ఉంటుందని తెలిపారు. సినిమా మొత్తం ప్రేక్షకులను నవ్విస్తుందని, చివర్లో తండ్రి – కొడుకు భావోద్వేగం అందరినీ కదిలిస్తుందని అన్నారు. నరేష్ మరియు వెన్నెల కిషోర్ కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
తనకు కథ మరియు పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటానని, స్టార్ హీరోలతో అవకాశం వచ్చినా కథ ముఖ్యమని శివానీ స్పష్టం చేశారు. కుటుంబం తనకు పూర్తి మద్దతు ఇచ్చిందని తెలిపారు. కూచిపూడి మరియు సంగీతం నేర్చుకున్న తాను, అవకాశమిస్తే పాటలు పాడేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని వెల్లడించారు. తాను ఎక్కువ సినిమాలు చేయాలని కాకుండా, మంచి కథలతో ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటానని చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!