

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మించిన రాజకీయ నేపథ్య ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, ఈ చిత్రం ఒక డిఫరెంట్ రాజకీయ భావోద్వేగ ఎంటర్టైనర్ అని తెలిపారు. సీనియర్ నటులు సాయికుమార్, సుమన్తో పాటు యంగ్ హీరోలు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సినిమాను రూపొందించామని, చంద్రబోస్ అందించిన పాటల సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఆ పాటలకు సునీత గారు తన మధురమైన గాత్రం అందించారని పేర్కొన్నారు. అన్ని హంగులతో ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ చిత్రంలో రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ వెంకట హనుమ, లిరిక్స్ చంద్రబోస్, గాయనం సునీత, ఫైట్స్ నందు మాస్టర్, కొరియోగ్రఫీ శ్రేష్టి వర్మ, డైలాగ్స్ అస్లాం, ఎడిటింగ్ సాయిబాబు తలారి, ఆర్ట్ భార్గవాచారి అందించారు. పీఆర్వోగా బి. వీరబాబు వ్యవహరించగా, జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరు భాస్కర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!