

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30 వ వర్ధంతి సందర్భంగా ఫిల్మ్నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు ఎన్టీఆర్తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ నంబర్వన్ అని కొనియాడారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపన లేకపోతే ఈరోజు అనేకమంది రాజకీయాల్లో ఉండేవారు కాదని అన్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు పరిశ్రమకు రెండు కళ్లు అని పేర్కొన్నారు.

మాదాల రవి, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రసన్నకుమార్, వై.వి.ఎస్. చౌదరి తదితరులు ఎన్టీఆర్ తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడని కొనియాడారు. ఆయన వెండితెరపై దేవుడిలా నిలిచారని, రాజకీయాల్లో స్వార్థరహిత నాయకుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు. మూడు దశాబ్దాలు గడిచినా ఎన్టీఆర్ జ్ఞాపకాలు ఇప్పటికీ కోట్లాది హృదయాల్లో సజీవంగా నిలిచాయని వారు పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!