

జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ కథానాయకుడిగా ‘అమరన్’ దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ఓం: చాప్టర్ 1’. ఇప్పటివరకు #D55గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘ఓం’ అనే టైటిల్ను అధికారికంగా ఖరారు చేశారు. ఆర్ టేక్ స్టూడియోస్, వండర్బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని దర్శకుడు రాజ్కుమార్ పెరియసామి తెలిపారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను కేవలం పేరును పరిచయం చేసేందుకు కాకుండా, ధనుష్ పోషిస్తున్న పాత్రను ప్రేక్షకులకు తొలిసారి చూపించేలా రూపొందించినట్లు చెప్పారు. ‘ఓం’ టైటిల్కు ఆధ్యాత్మిక భావనతో పాటు కథకు సంబంధించిన అనేక అర్థాలు ఉన్నాయని వెల్లడించారు.
ఈ చిత్రంలో ధనుష్ సరసన సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణం, యాక్షన్ నేపథ్యం, వినూత్నమైన స్క్రీన్ప్లేతో సినిమాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. మ్యూజికల్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎళిలరసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కలైవనన్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రధాన పాత్రల పరిచయ వీడియోలు, టీజర్, ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ధనుష్–రాజ్కుమార్ పెరియసామి తొలి కలయిక కావడంతో ‘ఓం: చాప్టర్ 1’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!