

‘జన నాయగన్’ సినిమాలో విదేశీ శక్తుల సహకారంతో దేశంలో మత కల్లోలాన్ని రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నాయని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్మురుగన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుకు సంబంధించిన ముఖ్యాంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
తీర్పులో భాగంగా, సెన్సార్ బోర్డు ఛైర్మన్ అధికారాలపై స్పష్టత ఇవ్వడంలోనూ, బోర్డు వాదనలు వినడంలోనూ సింగిల్ జడ్జి తగిన సమయం ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. అలాగే సినిమాకు యూ/ఏ 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించారన్న దానికి సంబంధించిన ఆధారాలను సినిమా నిర్మాణ సంస్థ కోర్టులో సమర్పించలేదని అభిప్రాయపడింది.
సెన్సార్ బోర్డు రివ్యూవింగ్ కమిటీ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయించామని కోర్టు తెలిపింది. సినిమాలో మత సామరస్యాన్ని భంగం చేసే సన్నివేశాలు ఉన్నాయని పేర్కొంది. అందుకే తొమ్మిది మంది సభ్యులతో కూడిన రివైజింగ్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే భద్రతా దళాలకు సంబంధించిన కీలక సన్నివేశాలు సినిమాలో ఎక్కువగా ఉండటంతో, మొదట సినిమాను పరిశీలించిన కమిటీలో సంబంధిత నిపుణులు లేకపోవడం వల్ల రివైజింగ్కు పంపాల్సి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. సినిమా బృందానికి కొత్తగా పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఇస్తున్నామని, అన్ని వాదనలు పూర్తిగా విన్న అనంతరం సినిమాను రివైజింగ్ కమిటీకి పంపాలా వద్దా అన్నది సింగిల్ జడ్జి నిర్ణయించవచ్చని న్యాయమూర్తులు తీర్పులో స్పష్టం చేశారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!