

కోలీవుడ్ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఎం.శరవణన్ (86) కన్ను మూశారు. వయోభారంతోపాటు పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం 3.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఏవీఎం బ్యానర్పై తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 300 లకు పైగా సినిమాలను నిర్మించారు. తెలుగులో 'సంసారం ఒక చదరంగం', 'ఆ ఒక్కటీ అడక్కు', 'మెరుపు కలలు', 'జెమిని', 'శివాజీ' చిత్రాలను నిర్మించారు. శరవణన్ మరణం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది.
బుధవారం పుట్టినరోజు జరుపుకున్న ఆయన అకస్మాత్తు మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మారింది. సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తమిళ సినిమాకు ఎనలేని సేవలు అందించారని సన్నిహితులు చెబుతున్నారు. ఎం. శరవణన్ తండ్రి, ప్రసిద్థ సినీ దిగ్గజం ఏ.వి. మేయ్యప్పన్ 1946 లో ఐకానిక్ ఏవీఎం స్టూడియోస్ను స్థాపించారు.

తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ శరవణన్ ఏవీఎం నిర్మాణ సంస్థ బాధ్యతలు చేపట్టి అనేక దశాబ్దాలపాటు సినిమా ప్రయాణాన్ని ముందుకు నడిపించారు. అతని నాయకత్వంలో ఏవీఎం ప్రొడక్షన్స్ అనేక భాషల్లో క్లాసిక్ చిత్రాలను తెరకెక్కించింది. శరవణన్ భౌతికకాయాన్ని గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఏవీఎం స్టూడియో మూడో అంతస్తులో ఉంచనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!