

రాజస్థాన్లోని పాలి జిల్లా జాదన్ గ్రామంలో ఉన్న ఓం ఆకార ఆలయం ప్రత్యేక నిర్మాణశైలి, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. పవిత్రమైన ‘ఓం’ ఆకారంలో నిర్మించిన ప్రపంచంలోని తొలి ఆలయంగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 250 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలో సంప్రదాయ నాగర శిల్పశైలి ప్రభావంతో పాటు అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యం కనిపిస్తుంది. సుమారు 2,000 అందంగా చెక్కిన స్తంభాలు ఆలయ నిర్మాణానికి ఆధారంగా ఉన్నాయి. ప్రధాన ఆలయం సుమారు 135 అడుగుల ఎత్తు వరకు ఉండగా, శిఖరంపై అరుదైన రాతితో రూపొందించిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఆలయ ప్రాంగణంలో 1,008 శివ విగ్రహాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 108 గదులు, కృత్రిమ సరస్సు ఈ ఆలయ సముదాయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఓం ఆశ్రమం, ఆలయ నిర్మాణం వెనుక విశ్వగురు మహామండలేశ్వర్ పరమహంస స్వామి మహేశ్వరానంద పురీజీ మహారాజ్ దూరదృష్టి ఉంది. ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం, ‘ఓం’ అనే విశ్వనాదంతో అనుసంధానం ప్రధాన ఉద్దేశాలుగా ఉన్నాయి. 1995లో నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఆలయం ఆధ్యాత్మికత, శిల్పకళ, పవిత్ర జ్యామితి కలయికగా ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!