

ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు ఆధారిత వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు–2026 ముసాయిదాపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఘటన దేశాన్ని కుదిపేసిందని ఆయన పేర్కొన్నారు.
బిల్లును వేగంగా రూపుదిద్దాలని అధికారులను ఆదేశిస్తూ, సమగ్ర నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. కర్ణాటకలో జరుగుతున్న ఇలాంటి చట్టాల రూపకల్పనను పరిశీలించాలని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్తో చర్చలు జరిపి చట్టాన్ని న్యాయపరంగా బలంగా రూపొందిస్తున్నామని తెలిపారు. తుది ఆమోదం అనంతరం ఈ చారిత్రాత్మక బిల్లును అసెంబ్లీకి తీసుకురానున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!