

రాఖీ పండుగ తేదీపై నెలకొన్న సందిగ్ధతకు పంచాంగ నిపుణులు స్పష్టత ఇచ్చారు. 2026లో రక్షాబంధన్ ఆగస్టు 27న జరుపుకోవాలా, 28న జరుపుకోవాలా అనే సందేహాలకు తెరపడింది. హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ శుక్ల పక్ష పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని ఆగస్టు 28న రక్షాబంధన్ జరుపుకోవాలని వేద పండితులు, పురోహితులు సూచించారు.
ఆగస్టు 28న ఉదయం 6:23 గంటల నుంచి 9:48 గంటల వరకు రాఖీ కట్టేందుకు అనుకూలమైన శుభ ముహూర్తంగా నిర్ణయించారు. అలాగే మధ్యాహ్నం 12:14 గంటల నుంచి 1:05 గంటల వరకు ఉండే అభిజిత్ ముహూర్తంలో కూడా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చని పండితులు తెలిపారు. ఇదే రోజున ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఉదయం 8:04 గంటల నుంచి 11:22 గంటల వరకు కొనసాగే ఈ గ్రహణం కన్యారాశిలో సంభవిస్తుందని, అయితే భారత్లో కనిపించదని తెలిపారు. అందువల్ల రక్షాబంధన్ వేడుకలపై గ్రహణ దోషం ఉండదని స్పష్టం చేశారు.
రక్షాబంధన్ పండుగకు పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణుడి చేతికి గాయం కావడంతో ద్రౌపది తన చీర కొంగును చింపి కట్టిందని, అందుకు ప్రతిగా కృష్ణుడు ఆమెను రక్షించాడని పురాణ కథనం. అలాగే బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాసూత్రం కట్టి విష్ణుమూర్తిని పాతాళం నుంచి తీసుకువచ్చిన కథ, మేవార్ రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపి సహాయం కోరిన చారిత్రక గాథ కూడా రక్షాబంధన్ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!