

స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. ప్రైవేట్ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసిన సూర్యాస్త్ర సుదూర రాకెట్ వ్యవస్థను ఒడిశాలోని చాందీపుర్ పరీక్ష కేంద్రం నుంచి విజయవంతంగా పరీక్షించారు. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల రెండు రకాల సూర్యాస్త్ర రాకెట్లను పరీక్షించగా, అవి 1.5 నుంచి 2 మీటర్ల కచ్చితత్వంతో లక్ష్యాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ కొనుగోలుకు భారత సైన్యం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
సూర్యాస్త్ర ఒక సుదూర మార్గదర్శిత రాకెట్ ఫిరంగి వ్యవస్థగా రూపొందించబడింది. శత్రు భూభాగంలోని స్థావరాలు, కమాండ్ కేంద్రాలు, రాడార్ కేంద్రాలు, సరఫరా కేంద్రాలపై కచ్చితమైన దాడులు చేయడానికి దీన్ని అభివృద్ధి చేశారు. సాధారణ ఫిరంగి గుండ్లతో పోలిస్తే, ఈ లోతైన దాడి మార్గదర్శిత రాకెట్లు ఆధునాతన మార్గనిర్దేశం మరియు నియంత్రణ వ్యవస్థల సాయంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తాయి. త్వరలోనే ఇది భారత ఆయుధ నిల్వలో చేరనుంది. ఈ అభివృద్ధి విదేశీ ఆయుధాలపై ఆధారాన్ని తగ్గించే దిశగా స్వదేశీ సంస్థల కృషిని చూపిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి బలాన్నిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!