

రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందిన కుటుంబాలు తరతరాలుగా అదే కోటాను కొనసాగించాలనుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత కూడా వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా వెలువడ్డాయి.
విద్యా, ఆర్థిక సాధికారతతో ఒక కుటుంబం సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా రిజర్వేషన్ల కోటాను కొనసాగించడం సరైన విధానం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇలా కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి సమాజం ఎప్పటికీ బయటపడలేదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల్లో నిజంగా అవసరమైన వారికి అవకాశాలు చేరేలా సమతుల్యత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
ఒకే కుటుంబాలు వరుసగా రిజర్వేషన్ల లాభాలు పొందితే అత్యంత వెనుకబడిన పేదలకు నష్టం జరుగుతుందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఓబీసీలకు అమలులో ఉన్న క్రీమీలేయర్ నిబంధనలను మరింత శాస్త్రీయంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!